సోమవారం

        తిరుపతిలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్ధులు గంజాయికి బానిసయ్యారు. ఏది చేస్తే నేరమో, ఏం చేస్తే జైల్లో పెడతారో, ఏం చేస్తే సమాజంలో పరువు పోతుందో బాగా తెలిసిన ‘లా’ స్టూడెంట్స్‌ సైతం మత్తుకు బానిసలుగా మారారు. ఈమధ్య మెడిసిన్‌ చదువుతున్న వాళ్లు కూడా ‘డ్రగ్స్‌’ రైడ్స్‌లో పట్టుబడ్డారు. ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును సర్వనాశనం చేస్తుందని తెలిసినా.. ఆ ఉచ్చులో పడిపోతున్నారు. ఏం అనాలి వీళ్లనసలు. కొన్ని ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో చదువుతున్న కొందరు విద్యార్ధులు కూడా డ్రగ్స్‌ ఊబిలో చిక్కుకుపోయారు. కేవలం పెద్దపెద్ద స్కూళ్లలోనే అనుకుంటే పొరపాటే. గంజాయి చాక్లెట్లకు గవర్నమెంట్‌ స్కూల్లో చదువుతున్న విద్యార్ధులు కూడా బానిసలైన హిస్టరీ ఉంది. సో, డ్రగ్స్ మహమ్మారి కొందరికే పరిమితం అని చెప్పడానికి లేదు. 


            యువత అయితే.. డ్రగ్స్‌ గుప్పెట్లోంచి బయటపడలేకపోతోంది. డ్రగ్స్‌ ఉన్నా, తీసుకున్నా నేరమే. సరే.. నేరం గురించి పక్కనపెడదాం. యువ వయసులో డ్రగ్స్‌ తీసుకుంటే.. మున్ముందు ఎందుకూ పనికిరాకుండా పోతారు. యువత నిర్వీర్యం అయితే.. దేశానికే ప్రమాదం. అయినా సరే.. డ్రగ్స్‌కు దాసోహం అవుతున్నారు. ఇక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లయితే రోజుకొకరు చొప్పున పట్టుబడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ యువత, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లంటే కేవలం మగాళ్లే కాదు ఆడవాళ్లు సైతం డ్రగ్స్‌ మత్తులో చిత్తవుతున్నారు. సినిమా రంగమైతే డ్రగ్స్‌ విషయంలో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ వస్తోంది.